నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అనునిత్యం మనం అనేక పనుల్ని చేస్తుంటాం.. వాటిలో కొన్ని పనుల్ని చేసేటప్పుడు చాలా ఆనందాన్ని పొందుతుంటాం, కొన్నింటిని విధిలేక ఈసురోమంటూ ఎలాగో పూర్తి చేస్తాం. నచ్చని పనుల్ని చేసేటప్పుడు శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో వత్తిడికి లోనవుతుంటాం…. ఆనందంగా చేసే పనులు మాత్రం అప్పుడే పూర్తయిందా అన్నంత హుషారుతో నిర్వర్తించడం జరుగుతుంది. ఒకే పని, ఇలా వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలను ఎందుకు మిగుల్చుతోంది అన్నది పనిని వారు స్వీకరించే మానసిక స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే.. స్వతహాగా మీకు నచ్చకపోయినాచేసే పని పట్ల ఇష్టాన్ని పెంచుకుని చేస్తే అది భారంగా ఉండకపోగా అంతకు ముందెన్నడూ పనిలో రుచి చూడని సంతృప్తిని మిగుల్చుతుందన్నది నగ్న సత్యం.  అంటే ఇక్కడ మనం ఏవేవి ఇష్టాలు అనుకుంటున్నామో అవన్నీ మన మనసులో గిరిగీసుకు కూర్చున్న తాత్కాలికమైన పరిమితులు అన్న విషయం అర్ధమవుతుంది. పరిమితులు, పరిధుల్ని చెరిపివేస్తే ప్రతీదీ ఆనందం అందించేదే!!! 

 

ప్రతీ పనీ సులభమైనదే! ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎవరైనా చాలా ఉత్సాహంగా, తానొక్కడే సంస్థని నడిపిస్తున్నంత శక్తివంతంగా పనిచేస్తారు. కాలం గడిచేకొద్దీ వృత్తి పట్ల నిరాసక్త ఆరంభమవుతుంది. ఎప్పుడైతే నిరాసక్తత ఏర్పడిందో అంతకుముందు క్షణాల్లో పూర్తయ్యే పనిని పూర్తి చెయ్యడానికి సైతం మానసికంగానూ, శారీరకంగానూ ఎంతో కష్టపడి చేయాల్సి వస్తుంటుంది. చాలామందిశ్రమించి శ్రమించీ తాము శారీరకంగా, మానసికంగా అలసిపోయామని భావిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇష్టమైన పనిని చేసేటప్పుడు ఎప్పుడూ శరీరం , మనస్సు అలసిపోవు.అవలీలగా పనులు పూర్తవుతాయి. మారుతుందల్లా వృత్తి పట్ల, మనం చేసే పనుల పట్ల మనకు గల దృక్పధమే. ఎంత కష్టపడ్డా గుర్తింపు రావడం లేదనో, ఆర్ధికంగా ఎదుగుదల లేదనో. ఇతరత్రా కారణాల వల్లనో మనకు మనం మనల్ని పోషిస్తున్న వృత్తుల పట్ల నిరాసక్తతని పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే ఇంత చేస్తున్నా ఏమీ ప్రయోజనం చేకూరడం లేదన్న ప్రతిఫలాపేక్ష మనసుని కమ్ముకుంటుందో అప్పుడు చేసే ప్రతీ పనీ ఎదో రూపేణా ప్రయోజనం ఉన్నదే చేయాలన్న స్వార్ధం జడలు విప్పుతుంది. దీనితో పనిపట్ల అంకితభావం, ఆనందం కొరవడుతుంది. దీంతో పనే భారం అవుతుంది. పనే భారమైతే కొన్నాళ్ళకు మనకు మనమే భారమవుతాము. చేసే పనినే దైవంగా స్వీకరించి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడంలోనే ఆనందాన్ని పొందగలిగే మానసిక స్థాయిని పొందినప్పుడే మన పనులు మనకు భారం కావు. మన మనస్సు ఎప్పుడూ ఆనందంతో , సంతృప్తితో నిండి వుంటుంది..

టైమ్ మెషిన్….

time_machine.jpg

ఈ కథ మొత్తం చదివి చివరలో అడిగిన ప్రశ్నకు జవాబివ్వగలరేమో ప్రయత్నించండి….

1975 జనవరి 1

ఉదయం ఐదు గంటలైంది. ఇంకా సూర్యుడు నిద్ర లేవలేదు. చీకటిగానే ఉంది.అది బాపూ అనాథాశ్రమం. దాని నిర్వాహకుడు ప్రకాశం అప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ అనాథాశ్రమాన్ని ప్రారంభించి చాలా ఏళ్ళయింది. దానికి ప్రకాశమే వ్యవస్థాపక నిర్వాహకుడు. ఇంతలో బయటనుండి కలకలం వినిపించింది. ప్రకాశం ఏంటా అని బయటకెళ్ళి చూసాడు.

అనాథాశ్రమం మెట్లపైన చీరలో చుట్టిన ఒక పసిపాప. ఆడపిల్ల. అంతటి చలిలో రోజుల పాపను అలా వదిలేసి వెళ్ళిన వాళ్ళపై ప్రకాశంకు చాలా కోపం వచ్చింది. ముద్దులొలికే ఆ పసిపాపను తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

17 ఏళ్ళ తరవాత..

ఆ పసిపాప (పద్మ) పెరిగి పెద్దదై ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. పద్మ వాళ్ళ క్లాస్‍మేట్ ఒకతనిని ప్రేమించింది. ఇద్దరొకటై గర్భవతైంది. అది తెలిసి హాస్టల్ నుండి గెంటేసారు. ప్రకాశం అది తెలుసుకుని వచ్చి పద్మను తిరిగి అనాథాశ్రమానికి తీసికెళ్తాడు. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది, కాని ఆ పాపను ఎవరో ఎత్తుకెళ్తారు. అది విని తట్టుకోలేక ప్రకాశం ఆత్మహత్య చేసుకుంటాడు.

ప్రసవ సమయంలో కలిగిన కొన్ని ఆరోగ్య సమస్యలవల్ల పద్మ డాక్టరును కలిసింది. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ డాక్టరు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు: ఆమెకు Adrenalo Sytosis అని, ఇది ఒక సీరియస్ జబ్బు .. దీనివల్ల శరీరంలో హార్మోనుల అవకతవకలు జరుగుతాయి. ఆపరేషన్ చేయాలి అని. కొద్ది రోజుల తర్వాత పద్మకు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ ఫలితంగా ఆమె మగవాడిగా (ప్రభు) మారిపోయింది.

ప్రభు చాలా బాధపడుతూ ఉండేవాడు, తన కన్నబిడ్డను పోగొట్టుకున్నందుకు, తనను పెంచిన ప్రకాశంగారు చనిపోయినందుకు, తన ప్రేమికుడు మోసగించినందుకు, మగవాడిగా మారవలసి వచ్చినందుకు… ఇది తలుచుకుంటూ తాగుడుకు అలవాటు పడ్డాడు.

ఒకరోజు ప్రభు తమ కాలనీలో ఒక కొత్త బార్ తెరవడం చూసాడు. దాని పేరు “అమృతా బార్”. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషి కనపడ్డాడు. ఆ వ్యక్తి ప్రభును పిలిచి తాను కనుగొన్న “టైం మెషీన్” చూపించాడు. ప్రభు ఆ వ్యక్తిని బ్రతిమిలాడి అది ఇంటికి తెచ్చుకుని తాను గతం లోకి వెళ్ళాడు. 1992 సంవత్సరంలోకి….

1992 సంవత్సరం…

ప్రభు తన టైం మెషీన్తో పాటు 1992 సంవత్సరంలోకి అడుగెడతాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు( అదే మగవాడిగా మారక ముందు ఉన్న అమ్మాయి). ఆమెని ప్రేమించి, కలిసి తిరిగి, ఒకానొక గడియలో ఒకటవుతారు. ఆ అమ్మాయి గర్భవతైంది. ప్రభు ఆమెను పెళ్ళాడటానికి నిరాకరించి, ఆ ఊరినే వదిలి వెళ్ళి పోతాడు. అలా ఇంకో ఊరికెళ్ళి కొంత డబ్బు సంపాదించి తిరిగి తను ప్రేమించిన అమ్మాయి ఉన్న ఊరికొస్తాడు.

కాని తనను గుర్తుపట్టకుండా ఉండాలని బారెడు గడ్డం పెంచుకుంటాడు.ఒక బార్ మొదలెడతాడు. “అమృతా బార్ “అని. ఒక రోజు అతను బార్లో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వస్తాడు( అదే వ్యక్తి ఇంతకు ముందు అమ్మాయిగా ఉన్నవాడు). గడ్డపు వ్యక్తి తన దగ్గరున్న టైమ్ మెషిన్ను ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి దాని సాయంతో గతంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక ముసుగు దొంగ వచ్చి కత్తి చూపించి ఆ టైమ్ మెషిన్ తన దగ్గర్నుంచి లాక్కుని ఆ గడ్డపు వ్యక్తిని తీసుకుని గతంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళాక ఆ ముసుగు దొంగ ఆ మెషిన్ తిరిగిచ్చేసి గడ్డపు వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడు.

గడ్డపు వ్యక్తి అలా అలా తిరుగుతూ బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. లోపలికెళ్ళి చూస్తే అక్కడొక అమ్మాయి (తర్వాత అబ్బాయిగా మారిన అమ్మాయే), పక్కన అప్పుడే పుట్టిన ఆడపిల్లను చూస్తాడు. ఆ పసిగుడ్డును తీసుకుని టైమ్ మెషిన్ మొదలెట్టి ఆ పాపతో సహా గతం (1975) లోకి వెళతాడు.

1975 జనవరి 1

ఉదయం సుమారు నాలుగున్నర అయింది. గడ్డపు వ్యక్తి ఆడపిల్లతో బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. ఆ పాపను ఆశ్రమ గుమ్మంలో వదిలి వెళ్ళిపోతాడు. కాలేజీలో చేరి బాగా కష్టపడి చదివి డాక్టరవుతాడు. ఒక రోజు ఒక స్త్రీ అతని ఆసుపత్రికి వస్తుంది. ఆమెను పరీక్షించి, ఆమెకు Adrenalo Sytosis అనే ప్రమాదకరమైన జబ్బు ఉన్నట్టు కనుగొని ఆపరేషన్ చేసి ఆ స్త్రీని మగవాడుగా మారుస్తాడు. ఆ తర్వాత టైమ్ మెషిన్ సహాయంతో గతంలోకి వెళతాడు. ఆప్పుడు అతను జనాలు పడుతున్న కష్టాలు చూసి మనసు ద్రవించి ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభిస్తాడు. దానికి బాపూ అనాథాశ్రమం అనే పేరు పెట్టి అనాథ పిల్లలకు ఆసరా ఇస్తాడు.

ఒక రోజు అతని ఆశ్రమం ముందు ఎవరో ఒక పసికందును వదిలి వెళతారు. అతను ఆ బిడ్డను తన కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు. ఆ పాప పెరిగి పెద్దదై చదువుకుంటూ ఒక హాస్టల్లో ఉంటుంది. ఒకరోజు అతనికి ఒక విషయం తెలుస్తుంది: ఆ ఆడపిల్ల ఒక వ్యక్తి వల్ల మోసపోయి గర్భవతైందని, హాస్టల్ వాళ్ళు గెంటేసారని. జాలితో ఆ అమ్మాయిని తమ ఆశ్రమానికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి ఒక ఆడపిల్లని కంటుంది.

ఆ వ్యక్తి…అదే ప్రకాశం భవిష్యత్తులోకి వెళ్ళాలని అనుకుంటాడు. ముసుగు ధరించి, ఒక తుపాకి తీసుకుని టైమ్ మెషిన్ తీసుకుని అమృతా బార్ కి వెళతాడు. బార్ లోపలికి వెళ్ళి ఆ గడ్డపు వ్యక్తిని బెదిరించి తనతో పాటూ గతంలోకి తీసికెళ్తాడు. కాని గతంలోకి వెళ్ళాక పశ్చాత్తాప పడి ఆ గడ్డపు వ్యక్తికి టైమ్ మెషిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలా తిరిగి మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చాక తెలిసిందేమంటే పుట్టిన పసిబిడ్డను ఎవరో ఎత్తుకెళ్ళారని. అది విని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు.

ఇంతకూ ఆ పసిబిడ్డను ఎత్తుకెళ్ళింది ఎవరూ????

తొలి ప్రచురణ పొద్దులో..

ఔరా పిల్లలు !!!!

ఈ రోజుల్లో పిల్లలు చెడిపోతున్నారని చాలామంది అనుకుంటున్నారు. చూస్తున్నాము కూడా. కాని మా పిల్లలతో జరిగిన ఒక సంఘటన తలుచుకుంటే నాకు ఆశ్చర్యమెస్తుంది. ఔరా నేటి తరం ఎంతా ఎదిగిపోయింది అని.

కొన్ని రోజుల క్రింద ఒక ఇంటర్వ్యూ ప్రశ్న అడిగా మా పిల్లలిద్దరిని.

ఒక చల్లని సాయంత్రం రమేష్ తన బైక్‌పై వెళుతున్నాడు . అలా వెళుతుండగా ఒక బస్‌స్టాపులో  ఒక ముసలావిడ జ్వరంతో ఉంది, అతని గర్ల్‌ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ సతీష్ ఉన్నారు. అప్పుడూ రమేష్ ఏం చేయాలి?? అందరినీ సంతోషపరచాలి ..ఆ రమేష్ స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావ్??

అసలు సమాధానం ఐతే అతను బైకును తన ఫ్రెండ్‌కిచ్చి ఆ ముసలావిడను ఆసుపత్రికి తీసికెళ్ళమని అతను అక్కడే తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తాడు.

మా అమ్మాయి మాత్రం ఇదే సమాధానం  చెప్పింది. కాని మా అబ్బాయి ఏమన్నాడో తెలుసా.తనే ఆ ముసలావిడను ఆసుపత్రికి తీసికెళ్తానని. నేనడిగా  అలా ఐతే నీ గర్ల్‌ఫ్రెండ్,బెస్ట్ ఫ్రెండ్‌కి న్యాయం చేయట్లేదు కదా.బైకు సతీష్‌కిచ్చి ముసలావిడను ఆసుపత్రికి తీసికెళ్ళమని, హాయిగా గర్ల్‌ఫ్రెండ్‌తో ముచ్చట్లేసుకోవచ్చుగా. వాడంటాడు. “తొక్కల గర్ల్‌ఫ్రెండ్!! ముందు ఆ ముసలావిడ ఆరోగ్యం ముఖ్యం కదా.ఐనా నా క్లోజ్ ఫ్రెండ్ ఐనంత మాత్రాన నా బైక్క్ ఇచ్చి వెళ్ళమంటే వాడు ఆ ముసలావిడను తీసికెళ్ళకుంటే, నా బైక్ తీసుకుని ఊరంతా తిరిగి మళ్ళీ రాకుంటే. సో నేను అలా చేయను. ఐనా ఈ అమ్మాయిలకు అంత ఇంపార్టెన్స్  ఎందుకివ్వాలి అంటాడు వెధవ. ఒక సంగతి చెప్పనా… అందరు అమ్మాయిలు అబ్బాయిలతో ఖర్చు పెట్టిస్తే , మావాడు మాత్రం అమ్మాయిలనే ముంచేస్తాడు. వాళ్ళనే ఖర్చు పెట్టించి. కాలేజిలో ఐనా, ఇప్పుడు  ఉద్యోగంలో ఐనా!! ఏం చేయను వాడితో??? 

బాగుపడతాడా??  

గోదావరి…

నిన్న నా పాత పుస్తకాలు అన్ని సర్దుతూ ఉంటే పాతికేళ్ళ క్రింద ఒక వార పత్రిక నుండి నేను కట్ చేసి పెట్టుకున్న ఈ పాట దొరికింది… నా బ్లాగులో పెట్టేసి దాచుకుంటూ మీ అందరితో పంచుకుంటున్నాను…… 

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

గోదావరీ దేవి గుండె జలజలలాడా

అదగొని మనసు కదలాడి జాలి

పొదులో పెల్లగిలి పూడి కిన్నెరా

గేదంగి తెల్ల రేకెత్తు క్రొత్తరగలలో

చాదుకొని పెనుతరంగ లూగే వాగు

నాదుగొన యామెవగ సాగే

 

గోదావరి జాలి గుండె గూడులు కదలి

సాదు కిన్నెర కెదురుపోయీ.. ఆమె

లోదిగులు తరగ చేదోయీవారించి

అదరముచే నామె నదిమి గౌగిట బూని

ఏది నీ మొగము నా తల్లీఅన్నదీ

నీ దిగులు నికమాను చెల్లీ

 

గోదావరి పేదగుండె లోతులు కలగి

రాదగ్గరకు రమ్ము తల్లీ ఎంత

సాదువే నా ముద్దు చెల్లీనీ వెన్ని

రాదగని కష్టాల రాశి మ్రగ్గితినమ్మ

నీదు పతి శిలరూపు పొందీ .. నీవేమో

ఓదె వనవాగుగా చిందీ

గోదావరీ జాలిగుండె ప్రేగులు తడిసి

నీ దుఃఖమెంతదో తల్లి నిన్ను

నాదరువుగా నమ్ము చెల్లి నిను చూచి

పేదలై, లోకాలు పెద్దలై యేలేటి

జొదులే, మతి చెడిరి తల్లి నీ యేడ్పు

రోదసిని నిండినది చెల్లీ

 

గోదావరీ యెడద కోసలను కోతపడి రా దగ్గరకు రమ్ము తల్లీ

జోదింక నిను కనడు చెల్లీ.. నా తల్లి

నాదు గర్భమున నిన్నాదుకుని ఉంటాను

నీదు నెగులును పోవచూడూ . కడలి

నీదు జోలికి నింక రాడూ

గోదావరీ దేవి కొస మనసులో వొరసి

ఏది నీ యొడలు నా తల్లీ చేర్చు

నాదు కౌగింటిలో చెల్లీ …. తల్లి నీ

లే దలిరు కెరటాలు చెల్లీ .. తల్లి నీ

లే దలిరు కెరటాలు నాదు కాల్వల నింతు

నీదు బొట్టును కడలి కనడూ నా తల్లి

నీదు సంగతి కడలి వినడూ

గోదావరీ మహా కూలంకషామృత

శ్రీదివ్య మధుతరంగాలూ.. చిన్న

సాదు కిన్నెర తరంగాలూ .. కలిసికొని

ప్రొదిగొను గంగా సరస్వతుల నీరములు

చాదుకొను తళుకు లురలించి .. చూడగా

సైదోడుతనము  మెరిపించె

 

 

విశ్వనాధ సత్యనారాయణ

కిన్నెరసాని పాటలనుండి….

 

మానసిక కాలుష్యం..

seaballycotton.jpg

 తుఫాను సమయంలో కారుమేఘాలు వడివడిగా పరుగిడే మాదిరిగా నాభి నుండి ఉద్భవించే మన ఆలోచనా తరంగాలు మనసు పొరలపై కామక్రోధాదులనే అరిషడ్వర్గాలను వర్షిస్తూ సాగిపోతుంటాయి. ప్రతీ ఆలోచన మనసుపై తనదైన ముద్ర మిగుల్చుతూ పోతుంది. ప్రస్తుతపు ఆలోచన కన్నా బలీయమైన, మనసుకు ఇంపైన అలోచన ప్రస్తుతపు ఆలోచనని హరించి మనసులో తాత్కాలికంగా ఆవరించుకుంటుంది. మన ఆలోచనలు మంచివైనా, చెడ్డవైనా మన బుద్ధిని అనుసరించే అవి నిర్ధిష్ట రూపం సంతరించుకుంటాయి. ప్రశాంతతను, హాయిని ఇచ్చే ఆలోచనాలను మాత్రమే మనసు కోరుకుంటుంటుంది. అయితే నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, అవమానాలు, భయాలు, అభద్రతాభావం, మనసుని అల్లకల్లోలం చేసే నెగిటివ్ ఆలోచనలను ఉసిగొలుపుతాయి. మనం ఎదుర్కొనే సంఘటనలకు ప్రతిస్పందనగా ఇబ్బడిముబ్బడిగా ఆలోచనలు ముప్పిరిగొంటుంటాయి

అయితే అవి కామక్రోధాదులనే మానవ బలహీనతలను మనస్సుపై వర్షించకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత మన ఇచ్చదే ! ఒక్కసారి ఇలాంటి బలహీనతలు మనస్సుపై ఆధిపత్యం సాధిస్తే… మన ఆలోచనలు కూడా ఈ బలహీనతలను ప్రేరేపించే విధంగానే ఉద్భవించడం ప్రారంభిస్తాయి. దీంతో మానసిక కాలుష్యం కమ్ముకుంటుంది. మనస్సు అల్లకల్లోలం అవుతుంది. అప్పటివరకూ ఆనందం అనిపించింది ఏదీ సంతృప్తిని ఇవ్వదు. నిశ్చలంగా మెలగవలసిన మనస్సనే దీపం అస్థిమితంగా కొట్టుకుంటుంది. ధనం, ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనే దురాశ, అన్నీ తెలుసునన్న అహంకారం, మనల్ని మనం సంస్కరించుకోవలసింది పోయి ఇతరుల విషయాలపై అమితాసక్తి, జన్మసంస్కారం లేకపోవడంవల్ల చేసే చర్యలు, కోరికలకు పగ్గాలు వేయలేకపోవడం వంటివన్నీ మన మనసుల్ని అస్థిమితపరుస్తూనే ఉంటాయి. మానసిక కాలుష్యం తొలగించుకోకుండా మనం మంచి మాటలు వల్లెవేసినా, మంచితనపు ముసుగుని కప్పుకున్నా నిష్ప్రయోజనమే స్థిమితమైన మనసుకి భావోద్వేగాలు అంటవు. అయితే అన్ని కాలుష్యాలూ తొలగించుకుని స్థిమితంగా ఉండాలన్న సంకల్పమే మనకు రుచించదు. మత్స్యకారుడికి నీచు వాసనే ఇంపైనట్లు కొందరికి మానసిక కాలుష్యమే సుగంధభరితం!!